Fri. Jan 30th, 2026

J365 NEWS:  ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా దిగ్గజ సంస్థ ఎలి లిల్లీ (Eli Lilly and Co) తెలంగాణలో తమ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాలను విస్తరించేందుకు సుమారు రూ. 9,000 కోట్ల (ఒక బిలియన్ డాలర్ల) భారీ పెట్టుబడిని ప్రకటించింది. ఈ పెట్టుబడి నిర్ణయం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో ఎలి లిల్లీ ప్రతినిధి బృందం తెలియజేసింది.ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశంలో ఎలి లిల్లీ అండ్ కో అధ్యక్షుడు ప్యాట్రిక్ జాన్సన్, ఇండియా ప్రెసిడెంట్ విన్స్‌లో టూకర్, మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా హాజరయ్యారు.ఎలి లిల్లీ తమ విస్తరణ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌ను ప్రధాన కేంద్రంగా తీసుకుని కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంపెనీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, తెలంగాణపై చూపిన నమ్మకానికి ధన్యవాదాలు తెలిపారు. పెట్టుబడులు తెచ్చే సంస్థలకు, పరిశ్రమలకు తమ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందిస్తుందని స్పష్టం చేశారు.

              హైదరాబాద్ ఇప్పటికే దేశంలోనే ఫార్మా హబ్‌గా నిలిచిందని, ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని ఆయన అన్నారు. 1965లో ఇందిరాగాంధీ ఐడీపీఎల్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడంతో రాష్ట్రంలో ఫార్మా రంగం విస్తరించిందని గుర్తుచేశారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న బల్క్ డ్రగ్స్‌లో 40 శాతం హైదరాబాద్ నుంచే వస్తున్నాయని, కోవిడ్ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా కూడా నగరం నిలిచిందని వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక ఫార్మా పాలసీను అనుసరిస్తోందని, జీనోమ్ వ్యాలీలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేయబడుతోందని ఆయన తెలిపారు.ఎలి లిల్లీ యొక్క ఈ కొత్త పెట్టుబడితో రాష్ట్రంలో వేలాది కెమిస్టులు, అనలిటికల్ సైంటిస్టులు, క్వాలిటీ కంట్రోల్ నిపుణులు, మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్, ఇంజనీర్లు వంటి ప్రతిభావంతులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.150 ఏళ్ల చరిత్ర కలిగిన అమెరికా సంస్థ ఎలి లిల్లీ ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్, ఒబెసిటీ, ఆల్జీమర్, క్యాన్సర్, ఇమ్యూన్ వ్యాధులు వంటి కీలక రంగాల్లో ఔషధ ఆవిష్కరణల్లో ముందంజలో ఉంది. ప్రస్తుతం భారతదేశంలో గురుగ్రామ్, బెంగళూరులో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ సంస్థ, ఇటీవల హైదరాబాద్‌లో గ్లోబల్ కెపాబులిటీ సెంటర్ (GCC)ను ప్రారంభించింది.ఈ పెట్టుబడి తెలంగాణలో ఫార్మా రంగానికి నూతన ఉత్సాహాన్ని, యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలను కలిగిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Share this post...