Tue. Mar 24th, 2026

విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాల ప్రదర్శన లక్ష్యంగా ఫిబ్రవరి నెలలో “బాల్ మేళ”నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బాల్ మేళాకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరిస్తూ విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాల పెంపు కోసం జిల్లాలో వినూత్న చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దీనిలో భాగంగానే ప్రయోగాత్మకంగా కొన్ని పాఠశాలల్లో వర్క్ షీట్స్ అమలు చేసి దాని ఫలితాలు విశ్లేషణ తర్వాత జిల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలను అందించమని, జిల్లాలోని 165 పాఠశాలల్లో ప్రత్యేకంగా రూపొందించిన గ్రంథాలయాలు ఏర్పాటు చేశామని, నూతన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులను నియమించామని, వీటన్నిటి ఆధారంగా పిల్లలలో అభ్యసన సామర్ధ్యాలను పెంపొందించడం ఉపాధ్యాయుల బాధ్యత అని అన్నారు. ఈ బాల్ మేళ ద్వారా విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను ప్రదర్శించి వారిని ప్రోత్సహించటం, అదేవిధంగా విద్యార్థులలో అభ్యసన సామర్ధ్యాల పెంపుదలకు కృషిచేసిన పాఠశాలలకు గుర్తింపునివ్వటం మొదలగు కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో పాఠశాల స్థాయిలో నిర్దేశించిన కృత్యాలను నిర్వహించి పాఠశాల స్థాయి బాలమేళాను నిర్వహించాలని, పాఠశాల స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కాంప్లెక్స్ స్థాయికి తీసుకువచ్చి కాంప్లెక్స్ స్థాయిలో బాలమేళాను నిర్వహించాలని తెలిపారు. ప్రతి కాంప్లెక్స్ స్థాయిలో అత్యంత ప్రతిభ కనబరిచిన పాఠశాలలను గుర్తించి వాటిని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల ద్వారా సత్కరించనున్నామని,అదేవిధంగా మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాలను గుర్తించి జిల్లా స్థాయిలో జరిగే బాలమేళాలో వారిని సత్కరించనున్నామని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, సమన్వయంతో సమర్థవంతంగా పనిచేసే బాలమేళాను విజయవంతం చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటేశ్వర చారి,జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ.నాగరాజశేఖర్ పాల్గొన్నారు.

Share this post...