మణుగూరు మండలంలోని అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం, దోమల నియంత్రణ, వీధి కుక్కల నివారణపై తక్షణ చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నే రవి ఎంపీడీవో శ్రీనివాస్ కి కమిషనర్ ప్రసాద్ గార్లకి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మణుగూరు మండలంలోని పంచాయతీలు, మున్సిపాలిటీ పరిధిలో చెత్తా చెదారం పేరుకుపోయి, డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో మురుగునీరు నిలబడి దోమల ప్రబలత పెరిగింది. దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు.అలాగే ఆయన వీధి కుక్కల సమస్యపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ,వీధి కుక్కలు పిచ్చి వ్యాధితో పిల్లలను కరుస్తున్నాయి. మటన్,చికెన్ మార్కెట్ల వద్ద వ్యర్థాలు బహిర్గతంగా పడేయడంతో కుక్కలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.ఈ సమస్యలపై అధికారులు తక్షణ చర్యలుతీసుకోవాలని కోరారు.కమిషనర్ ప్రసాద్ సానుకూలంగా స్పందించి, తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కర్నే రవి విలేకరులకు తెలిపారు.
